మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (07:31 IST)

సార్వత్రిక తొలి దశ పోలింగ్ స్టార్ట్.. ఏపీలో భిన్నమైన వాతావరణం

దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వరుసలో నిల్చొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 
 
ఇందులో ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 8, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఉత్తరాఖండ్‌లో 5, ఒడిశాలో 4, బీహార్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 2, అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, చత్తీస్‌గఢ్‌లో 1, జమ్ముకశ్మీర్‌లో 2, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ బరిలో 2,118 మంది అభ్యర్థులున్నారు. 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.98 కోట్లు కాగా, వీరిలో మహిళా ఓటర్లు 1.98 కోట్ల మంది. పురుష ఓటర్లు 1.94 కోట్ల మంది. ఇక, తొలిసారి ఓటు వేయబోతున్న వారి సంఖ్య 10 లక్షలు. 
 
ఇకపోతే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, బరిలో 443 మంది అభ్యర్థులున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. అయితే, ఈ పోలింగ్ సమయాని మరో గంట పొడిగించారు. పలు ప్రాంతాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 
 
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్ ముగియనుంది. తెలంగాణలోని నిజామాబాద్‌లో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఎన్నికల కోసం ఏపీలో 1.10 లక్షల మంది, తెలంగాణాలో 80 వేల మంది పోలీసు బలగాలను బందోస్తు కోసం వినియోగించారు.