శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (10:40 IST)

నిజామాబాద్‌ స్థానంపై ఉత్కంఠ : కవితను ఓడించేందుకు ఏకమైన రైతులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి నిజామాబాద్ లోక్‌సభ స్థానంపై కేంద్రీకృతమైంది. ఈ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు పసుపు, ఎర్రజొన్న రైతులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 185కు చేరింది. 
 
ఇపుడు ఈ స్థానంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించడం ఎన్నికల సంఘానికి తలకుమించిన భారంగా మారింది. రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలా? లేదా ఈవీఎంలు ఉపయోగించాలా అనే అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు మాత్రం ఏవిధంగానైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమే అంటున్నారు.
 
తమ సమస్యను జాతీయస్థాయిలో ప్రతిబింభించేందుకు పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున్న నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కారణంగానే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఉత్కంఠంగా మారింది. భారీ సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఆర్మూర్, బోధన్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీగా కె.కవిత మళ్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈమెను భారీ మెజార్టీతో ఓటర్లు గెలిపించారు. కానీ, ఆమె ఓటర్లుక ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగానే రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.