శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (12:59 IST)

23 సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు రిజైన్... 30న జగన్ ప్రమాణం.. ఏకాదశ తిథిలో...(video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు మే 23వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేయనున్నారు. ఆయన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు తన రాజీనామా లేఖను పంపించనున్నారు. ఈ లేఖను ప్రత్యేక దూత లేదా ఫ్యాక్స్‌లో పంపించే అవకాశం ఉంది. 
 
మరోవైపు, నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30వ తేదీ గురువారంతో పాటు... ఏకాదశ తిధి కావడంతో ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. 
 
ఇదిలావుండగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడవుతున్న విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో, ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేల అంచనాలకు సైతం అందకుండా.. తాజా అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించింది. 
 
ప్రస్తుతం అందుతున్న కౌంటింగ్‌ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు.

నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసే అవకాశముంది.