శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By chj
Last Modified: గురువారం, 3 మార్చి 2016 (13:03 IST)

పెళ్లి చేయలేదని అలిగి వెళ్లిన కార్తికేయుడు... అందుకే శ్రీశైల పర్వతంపై మల్లికార్జునుడు

మహాశివరాత్రి స్పెషల్ కథనాలు... మహాశివరాత్రి మార్చి 7

మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది తీరంలో శ్రీశైల పర్వతం మీద ఉంది. ఈ పర్వతాన్ని దక్షిణ కైలాసంగా పేర్కొంటారు. ఇంకా ఈ పర్వత మహత్మ్యం ఔన్నత్యాల వర్ణన సవిరంగా మహాభారతం, శివపురాణ, పద్మపురాణం మొదలైన మహాపురాణాల్లో చెప్పబడి ఉంది. పురాణాల్లో జ్యోతిర్లింగ గాధ ఈ విధంగా పేర్కొనబడింది.

ఒకసారి శంకర భగవానుని ఇరువురు పుత్రులు గణపతి, కుమారస్వాములు వివాహం కోసం పరస్పరం పోట్లాడుకోసాగారు. ముందు నా వివాహమే జరగాలని ఎవరికి వారు పట్టుబట్టారు. వారి పోట్లాట కొట్లాటలు చూసి మాతాపితురులైన పార్వతీపరమేశ్వరులు... మీయిద్దరిలో ఎవరు ముందుగా సమస్త భూమండలాలన్నీ చుట్టి వచ్చి ఎవరు ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వారి వివాహం ముందుగా చేయబడుతుంది అని చెప్పారు. 
 
మాతాపితరుల మాట విన్న వెంటనే కార్తికేయుడైన కుమారస్వామి వెనువెంటనే పృథ్వీ ప్రదక్షణకు పరుగులు తీశాడు. కానీ గణపతికి మాత్రం ఇది చాలా కష్టకార్యము. ఒకటి ఏమిటంటే ఆయనది స్థూలకాయము. ఇక రెండవది ఆయన వాహనం కూడా మూషికం. కనుక ఈ విషయంలో కుమారస్వామితో సమానుడు కాలేడు. కానీ వినాయకుడు ఎంత స్థూలకాయుడో ఆయన బుద్ధి అంత సూక్ష్మమైనది. తీక్షణనమైనది. ఆయన జాగు చేయకుండా భూప్రదక్షణకు ఓ సులభోపాయాన్ని కనిపెట్టాడు. ఎదురుగా కూర్చున్న మాతాపితరులకు పూజ చేసి ఆ పైన వారికి ఏడు ప్రదక్షణలు చేసి భూప్రదక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అతని కార్యము శాస్త్రామోదితమైనది. 
 
సమస్త భూమండలాన్ని చుట్టి కుమారస్వామి తిరిగి వచ్చేసరికి గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే పేరుగల ఇరువురు కన్యలతో వివాహం అయిపోయింది. వారికి క్షేమం, లాభం అనే ఇరువురు పుత్రులు కూడా కలిగారు. ఇదంతా చూసిన కుమారస్వామి కృద్ధుడై క్రౌంచ పర్వతం మీదకు వెళ్లిపోయాడు. అదిచూసిన పార్వతిమాత ఆయన అలక తీర్చడానికి అక్కడికి చేరుకుంది. ఆ వెనుకనే శంకరుడు కూడా అక్కడికి చేరి, జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. నాటి నుండి మల్లికార్జున జ్యోతిర్లింగ నామంతో ప్రఖ్యాతుడయ్యాడు. ఈయన అర్చన ప్రప్రథమంగా మల్లికాపుష్పాలతో చేయబడింది. మల్లికార్జున నామం ఏర్పడటానికి యిదే కారణం.
 
మరో గాథ కూడా యిలా ఏర్పడింది. శ్రీశైల పర్వత సమీపంలోనే చంద్రగుప్త మహారాజు రాజధాని ఉండేది. ఒకానొక విపన్ని వారణార్థం ఆయన కుమార్తె ఒకతె అంతఃపురాన్ని వీడి పర్వత రాజాశ్రయాన్ని పొంది, గోపకులతో పాటు నివశించసాగింది. ఆ కన్య వద్ద మహాశుక్ష లక్షణ, సుందరమైన శ్యామ ధేనువు ఉంది. నల్లని గోవు క్షీరాన్ని రాత్రివేళల్లో దొంగ ఎవరో పితుక్కుపోతుండేవాడు. ఒకరోజున దైవ ఘటనగా ఆ రాజకన్య దొంగ పాలు పితుకుతుండగా చూసింది. 
 
కోపంతో ఆమె ఆ దొంగ వైపు పరుగెత్తింది. కానీ గోవు వద్దకు పరుగెత్తి చూసేసరికి అక్కడ ఆమెకు శివలింగం తప్ప మరొకటి కనిపించలేదు. ఆ రాజకుమారి కొంత కాలమయ్యాక ఆ శివలింగం మీద ఒక విశాల దేవాలయాన్ని నిర్మింపజేసింది. శివరాత్రి పర్వదినాన యిక్కడ మహా మహోత్సవం జరుగుతుంది. ఆ శివలింగమే మల్లికార్జున నామంతో ప్రసిద్ధమైంది.
 
ఈ మల్లికార్జున శివలింగం గురించి తీర్థక్షేత్రాన్ని గురించి పురాణాల్లో అత్యంత మహిమోపేతంగా పేర్కొనబడింది. ఇక్కడకు విచ్చేసి, యిక్కడి శివలింగాన్ని దర్శించి పూజలు, అర్చనలు చేసే భక్తుల సకల మనోవాంఛనలు సంపూర్ణంగా నెరవేరుతాయి. వారికి శివభగవచ్చరణాలపై స్థిర ప్రీతి కలుగుతుంది. దైహిక, దైవిక, భౌతికమైన అన్నివిధాల బాధల నుండి వారు విముక్తులవుతారు. శివభగవానునిపై భక్తి మనుష్యులకు మోక్ష మార్గగామి.