శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (16:42 IST)

పొగతాగి తగలడుతున్న మహిళలు.. పీహెచ్ఎఫ్ఐ నివేదిక..!

ఇండియాలో ధూమపానం సేవించే మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత 15 సంవత్సరాల కాలంలో ధూమపాన సేవనాన్ని అలవాటు చేసుకున్న మహిళల సంఖ్య రెట్టింపు అయిందని పీహెచ్ఎఫ్ఐ (పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) తన తాజా నివేదికలో వెల్లడించింది. 
 
ఈ విషయం గురించి పీహెచ్ఎఫ్ఐ, హెల్త్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్, డాక్టర్ మోనికా అరోరా మాట్లాడుతూ.. ఇటీవల మహిళలూ పొగతాగి తగలడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996 సంవత్సరం ప్రాంతంలో కేవలం 10 శాతం మంది మహిళలు మాత్రమే పొగ తాగేవారని, ఆ సంఖ్య 2010 నాటికి 20 శాతానికి చేరిందని తెలిపారు. 
 
అయితే ఇదే సమయంలో పురుషుల సంఖ్య అంతగా పెరగలేదని, పురుషుల్లో 45 నుంచి 57 శాతం మంది పొగతాగేవారున్నారని పేర్కొంది. అసలు మహిళలు ఎక్కువగా పొగతాగడానికి మహిళా సాధికారత, మహిళా స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం, సాంఘిక వృద్ధి వంటి పలు కారణాలు ఉన్నాయన్నారు. 
 
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో సైతం పొగతాగే అలవాటు పెరుగుతోందని ఆమె వివరించారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటీమణులు పొగతాగే సన్నివేశాలు చోటు చేసుకోవడం కూడా ఇందుకు కారణమని అరోరా తెలిపారు.