25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్.. స్పీకర్ చర్యలు : లోక్సభ రేపటికి వాయిదా
లోక్సభ కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతూ చిరాకుపుట్టించిన కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో 25 మందిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెన్షన్ అస్త్రాన్ని ప్రయోగించారు. సభా నియమాలకు విరుద్ధంగా నడుచుకున్నారన్న సాకుతో ఐదు పని దినాల పాటు 25 మందిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి.. సభను మంగళవారానికి వాయిదా వేశారు.
లలిత్ గేట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, వ్యాపం స్కామ్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో సోమవారం కూడా సభలో గందరగోళం చోటుచేసుకుంది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇందులో కూడా ఇరుపక్షాలు తమతమ వాదనలకే కట్టుబడ్డాయి. ఆ తర్వాత సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఎప్పటిలా నినాదాలు చేశారు. విపక్ష ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు పట్టుకుని నిరనస వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని, లేని పక్షంలో సభ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. ఫ్లోర్ లీడర్లు తమ ఎంపీలను వెనక్కి పిలవాలని స్పీకర్ కోరారు.
తాము ఆందోళన చేస్తుంటే, సస్పెండ్ చేస్తామని బెదిరించడం సరికాదని పలువురు విపక్షనేతలు స్పీకర్కు సూచించారు. అయినప్పటికీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నందుకు 25 మంది కాంగ్రెస్ ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసిన వెంటనే సభను మంగళవారానికి వాయిదా స్పీకర్ వాయిదా వేశారు.