శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (13:39 IST)

బాబా రాంపాల్ ఆశ్రమంలో 315 బోర్ రైఫిల్స్ 10, బాంబులు, యాసిడ్ బాటిల్స్... ఇంకా ఎన్నో..

హర్యానా రాష్ట్రం హిస్సార్‌లోని బాబా రాంపాల్ ఆశ్రమమైన సత్‌లోక్‌లో ఆయుధాల గుట్టలు బయటపడుతున్నాయి. ఆశ్రమం పేరుతో రాంపాల్ అనుచరులు భారీ ఎత్తునే ఆయుధాలను సమకూర్చుకున్నారు. తాజాగా రాంపాల్ ఆశ్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టిన తరువాత ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడయ్యాయి. మారణాయుధాలు పోలీసులకు దొరికాయి. 12 బోర్ రైఫిల్స్-23... 315 బోర్ రైఫిల్స్-10, ఒక పిస్టల్ లభించాయి. 
 
వీటితో పాటు వందల సంఖ్యలో బాటిల్ బాంబులు, యాసిడ్ డబ్బాలు దొరికాయి. అంతే కాదు అత్యంత విలాసవంతమైన భవనాలు, స్విమ్మింగ్ పూల్, మూవీ థియేటర్లు ఆశ్రమంలో ఉన్నాయి. ఆశ్రమం మొత్తాన్ని ఖాళీ చేయించామని, ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఆశ్రమం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బాబా రాంపాల్‌ను హిస్సార్ సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిసింది.
 
మరోవైపు.. నెలల తరబడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బాబా రాంపాల్ గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ వింత వాదనను వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను పోలీసులకు సహకరించాలనే అనుకున్నా, తన సొంత కమెండోలు అందుకు అంగీకరించలేదని, తనను బయటకు రాకుండా బంధించారని ఆయన చెప్పారు.దీంతో న్యాయమూర్తి రాంపాల్ కొత్త వాదనపై విస్మయం వ్యక్తం చేశారు. 'మీ వాదన నమ్మశక్యంగా లేదే!' అంటూ రాంపాల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. అంతేకాక సదరు వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కేసులో తదుపరి విచారణను కొనసాగించారు.