శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (11:03 IST)

కేరళకు చెందిన ఎన్నారై కుమార్తె వివాహం.. బాహుబలి సెట్టింగ్.. రూ.55కోట్లు ఖర్చు!

కేరళకు చెందిన ఎన్నారై తన కుమార్తెకు అట్టహాసంగా పెళ్లి చేయనున్నాడు. కేరళ కేంద్రంగా విదేశాల్లో ఉంటున్న వారిలో అత్యధిక సంపన్నుడైన రవి పిళ్లై.. 26 కంపెనీలు నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీల్లో 80వేల మంది పనిచేస్తున్నారు. గనులు, విద్య తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఆర్పీ గ్రూప్ అధినేత, బిలియనీర్ అయిన రవి పిళ్లై తన కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా చేయాలనుకున్నాడు. ఇటీవలి సూపర్ హిట్ చిత్రం 'బాహుబలి' తెగ నచ్చేసిందో ఏమో... ఆ చిత్రంలోని సెట్ల తరహాలోనే వివాహ మండపాన్ని తీర్చిదిద్దించాడు. 
 
ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ (బాహుబలికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్)కు పనులప్పగించి తిరువనంతపురంలో ఎనిమిది ఎకరాల్లో రూ. 20 కోట్లతో సెట్టింగులు వేయించాడు. వివాహానికి మొత్తం రూ. 55 కోట్లు ఖర్చవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇంకా 42 దేశాల నుంచి వందలాది మంచి వీఐపీలు వివాహ మహోత్సవానికి రానున్నట్లు సమాచారం. హీరోయిన్లు శోభన, మంజు వారియర్ తదితరులు అతిథులను అలరించేందుకు నృత్యాలు చేయనున్నారు. 
 
వీఐపీలను మండపానికి చేర్చేందుకు ప్రత్యేక విమానాలూ సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారత్‌లో అత్యధిక ఖర్చుతో జరుగుతున్న వివాహ మహోత్సవం ఇదే కావడం గమనార్హం. ఇంకా ఈ మండపానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 250 పోలీసు బలగాలతో పాటు 350 ప్రైవేట్ బలగాలను మోహరించడం జరిగిందని నిర్వాహకులు అంటున్నారు.