ముంబైలో బాయ్ ఫ్రెండ్స్తో జాగ్రత్త... పోలీసు కమిషనర్ హెచ్చరిక
ముంబైలో అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడే బాయ్ఫ్రెండ్స్ సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందనే విషయం తాజా గణాంకాల ద్వారా తేటతెల్లమవుతోంది. అక్కడ జనవరి నుంచి ఇప్పటి వరకు 542 అత్యాచార కేసులు నమోదు కాగా, అందులో 389 కేసుల్లో బాయ్ఫ్రెండ్స్ చేతుల్లో ఆమ్మాయిలు అత్యాచారానికి గురైనవే అని ముంబై పోలీసులు అంటున్నారు.
ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ... మంచి మాటలతో అమ్మాయిలను నమ్మించి, వారిని లొంగదీసుకుని, అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడి, చివరికి తమకేమీ తెలియనట్టు చేతులు దులుముకునే మోసగాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. కనుక అమ్మాయిలు బాయ్ఫ్రెండ్స్తో జర జాగ్రతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకు 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకోగా, వాటిలో 389 కేసులు బాయ్ఫ్రెండ్ చేతిలోనే యువతులు అత్యాచారానికి గురైయ్యారని చెప్పారు. బాయ్ఫ్రెండ్లు చెప్పే మాయ మాటలను యువతలు వెంటనే నమ్మడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాకేశ్ మారియా విశ్లేషించారు.
కాగా మరో ఆరు శాతం మంది యువతులు ఆగంతకుల చేతిలో అత్యాచారానికి గురైయ్యారని తెలిపారు. మిగిలిన యువతులు మాత్రం బంధువులు లేక పరిచయస్థుల చేతిలో అత్యాచారానికి గురైనవారని ఆయన చెప్పారు. అయితే మొత్తం 542 అత్యాచార కేసుల్లో ఇప్పటివరకు 477 కేసులను ఛేదించినట్లు రాకేశ్ మారియా వివరించారు.