బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (12:09 IST)

జయలలిత వర్థంతి: అనాథగా మారిన అన్నాడీఎంకే.. అమృత ఎంట్రీ ఇస్తారా?

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి నేడు. అమ్మా అంటూ తమిళ ప్రజలచే ఆప్యాయంగా పిలిపించున్న జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. గత ఏడాది డిసెంబర్ ఐదో తేదీన ఆమె కన్నుమూశారు. డిసె

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి నేడు. అమ్మా అంటూ తమిళ ప్రజలచే ఆప్యాయంగా పిలిపించున్న జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. గత ఏడాది డిసెంబర్ ఐదో తేదీన ఆమె కన్నుమూశారు. డిసెంబర్ ఆరో తేదీన చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. 
 
గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్యకారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. కోలుకుంటున్నారని, డిశ్చార్జ్ అవుతారని ప్రచారం జరుగుతుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయారనే వార్తను అపోలో వైద్యులు ప్రకటించారు. దీంతో జయ మరణంపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. జయ నెచ్చెలి శశికళనే అమ్మ మృతికి కారణమంటూ జోరుగా చర్చ సాగింది. 
 
ఆస్పత్రిలో 75 రోజుల పాటు అత్యున్నత స్థాయిలో అంతర్జాతీయ వైద్యులు చేసిన చికిత్స ఏమైందని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమ్మ మృతిపై సీబీఐ విచారణకు కూడా డిమాండ్ చేశాయి. అన్నాడీఎంకేలో చీలికవర్గ నేత పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. నలువైపులా వస్తున్న ఒత్తిళ్లతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25వ తేదీన రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించారు. మూడునెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్‌కు సీఎం గడువు విధించిన సంగతి తెలిసిందే. 
 
జయ అనంతరం సీఎం కుర్చీ ఎక్కిన పన్నీర్‌సెల్వం.. రెండు నెలలకే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. శశికళ కోసం, శశికళ చేత సీఎం కుర్చీని దూరం చేసుకున్న ఓపీఎస్‌.. తిరిగి దానిని సొంతం చేసుకోలేకపోయారు. ఫలితంగా సీఎం పీఠం కోసం జరిగిన కుమ్ములాటలో.. ఎక్కడ నుంచో ఊడిపడిన ఈపీఎస్ తమిళనాడు సీఎం అయ్యారు. కానీ విధి వక్రీకరించడంతో శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. చివరికి బీజేపీ జోక్యంతో అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు ఏకమైనాయి. ఆర్కే నగర్ ఎన్నికల నగారా కూడా మోగింది. 
 
అమ్మ నియోజకవర్గంలో మధుసూధనన్ బరిలోకి దిగుతున్నారు. ఇరు వర్గాలు ఏకమైనా.. ఆర్కేనగర్ ఎన్నికల్లో శశికళ మేనల్లుడు దినకరన్ సినీ నటుడు, నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ను బరిలోకి దించడం ప్రస్తుతం చర్చకు తావిచ్చింది. దీంతో ఆర్కే నగర్ ప్రజలు అమ్మ కోసం మధుసూదనన్‌ను గెలిపించాలా? యువనేత విశాల్‌కు ఓటేయాలా అనేది తెలియని అమోయమంలో వున్నారు. ప్రజలే కాకుండా.. అన్నాడీఎంకే నేతలు సైతం అమ్మ లేని లోటును కళ్లారా చూస్తున్నారు. 
 
అమ్మ లేకపోవడంతో అయోమయంలో వున్నారు. అమ్మలేని పార్టీ ప్రస్తుతం అనాధలా మారిపోయిందని.. ఈ పార్టీ తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకోవాలంటే అమ్మ వారసులు రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి అమ్మ చోటును.. ఆమె కుమార్తె అని చెప్పుకుంటున్న అమృత న్యాయపరమైన రుజువులు పూర్తయ్యాక రంగంలోకి దిగుతారా? లేదా అనేది వేచిచూడాలి.