గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (16:40 IST)

రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు

షిల్లాంగ్‌లో అకాలమరణం చెందిన మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయన పుట్టిపెరిగిన రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం తమిళనాడు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇందులోభాగంగా కలాం అంత్యక్రియలు జరిగే ప్రదేశాన్ని కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి, అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ అంత్యక్రియల ఏర్పాట్లను తమిళనాడు సీనియర్ మంత్రి ఒ.పన్నీర్ సెల్వం పర్యవేక్షించేలా ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
 
ఇదిలావుండగా, ప్రస్తుతం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న కలాం అధికారిక నివాసంలో ఆయన పార్థివదేహం ఉంది. ఇక్కడ వివిధ పార్టీలకు చెందిన నేతలు కలాంకు నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం రేపు ఉదయం ఢిల్లీ నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం రాత్రి 7 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వాస్తవానికి కలాం అంత్యక్రియలు బుధవారమే జరుగుతాయన్న వార్తలు వచ్చాయి.