శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:32 IST)

అహ్మదాబాద్‌లో స్వైన్ ఫ్లూ దడ... 144 సెక్షన్ అమలు..!

దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి దడపుట్టిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల అధికారులు స్వైన్ ఫ్లూ బారి నుంచి రక్షణ పొందేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేశారు.
 
సెక్షన్ 144 గురించి అందరికి తెలుసు. ఏవైనా హింసాత్మక ఘటనలు జరిగినపుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు ఈ సెక్షన్ ను విధిస్తారు. ఎలక్షన్ టైంలోనూ దీన్ని వాడతారు. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సంబంధం లేకుండా స్వైన్ ఫ్లూ రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో అధికారులు సెక్షన్ 144 ను విధించారు.
 
ప్రజలు రోడ్లపై గుంపులుగా కనిపించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కువ మంది కలిసి వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లోనే స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా, అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.