గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (10:13 IST)

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు.. గోల్డెన్ బే రిసార్ట్స్ బిల్లు ఎంతో తెలుసా?

అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అధికార పోటీ కారణంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇందులో ప్రధాన కార్యదర్శి శిశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కాంచీపురం జిల్లా కూవత్తూరులోని

అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అధికార పోటీ కారణంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇందులో ప్రధాన కార్యదర్శి శిశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కాంచీపురం జిల్లా కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్సులో ఉంచారు. అత్యంత లగ్జరీ రిసార్ట్సుగా ఉన్న ఈ ప్రైవేట్ రిసార్ట్సులో ఉన్న ఎమ్మెల్యేలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే, ఎమ్మెల్యేలకు రక్షణగా సుమారు 500 మంది వరకు బౌన్సర్లు సెక్యూరిటీగా ఉన్నట్టు సమాచారం. అయితే, గతవారం రోజులుగా ఈ రిసార్టులో బస చేస్తున్నందుకు బిల్లు ఎంత అయిందన్న అంశాన్ని పరిశీలిద్ధాం. 
 
గోల్డెన్ బే రిసార్ట్‌లో సుమారు 60 గదులున్నాయి. వాటిలో మూడు రకాలు ఉంటాయి. ట్రాంక్విల్ రూంలు అయితే రోజుకు రూ.5,500 చొప్పున, బే వ్యూ రూంలు అయితే రూ.6,600 చొప్పున, పారడైజ్ సూట్‌లు అయితే రూ.9,900 చొప్పున అద్దెలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అన్ని రకాల గదులను రూ.7500 చొప్పున రోజుకు బుక్ చేసుకున్నారని అనుకున్నా కూడా.. దాదాపు ఆరు రోజులకే బిల్లు రూ.27 లక్షల వరకు వెళ్తుంది. 
 
ఇక ఆహారం, మంచినీళ్లు, స్నాక్స్, పండ్లు, మద్యం.. ఇతర ఖర్చులన్నీ వేరు. దాదాపు ప్రతిరోజూ రాత్రి పూట ఎమ్మెల్యేల వినోదం కోసం భారీ ఎత్తున పార్టీలు జరుగుతున్నాయని సమాచారం. సుమారు 200 మంది మాత్రమే రిసార్టులలో ఉన్నారని అనుకున్నా, వాళ్లకు తిండి, ఇతర పానీయాల ఖర్చు రోజుకు సగటున రూ.2500 చొప్పున వేసుకుంటే ఆరు రోజులకు మరో రూ.30 లక్షల వరకు అవుతుంది.
 
బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగిన తర్వాత అటునుంచి అటే వాళ్లందరినీ రిసార్టుకు తీసుకెళ్లిపోయారు. దాంతో వాళ్లు అసలు కనీసం దుస్తులు కూడా తెచ్చుకోలేదు. దాంతో ప్రతి ఒక్కరికీ ఇన్నిరోజులకు సరిపడా కొత్త దుస్తులు కొని తెచ్చారు. దానికోసం రోజుకు వెయ్యి రూపాయలు వేసుకున్నా, ఆరు రోజులకు కలిపి రూ.12 లక్షలు అవుతుంది. వీటితో పాటు ఎమ్మెల్యేలు ఏవైనా అదనపు సదుపాయాలు, సేవలు కోరుకుంటే వాటిని కూడా కల్పించాల్సిందే కాబట్టి వాటి ఖర్చు కూడా లెక్క వేసుకోవాలి. ఇలా చూసుకుంటే దాదాపు ఈ వారం రోజులకు సుమారు కోటిన్నర రూపాయల మేరకు ఖర్చు అయివుంటుంది. 
 
ఇపుడు ఈ బిల్లును ఎవరు చెల్లించారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్నాడీఎంకే నిధుల లావాదేవీలు జరపడానికి వీల్లేదంటూ ఆ పార్టీ కోశాధికారి హోదాలో ఓ.పన్నీర్ సెల్వం అన్ని బ్యాంకులకు లేఖలు రాశారు. దీంతో ఆ పార్టీ నిధులన్నీ ప్రస్తుతం స్తంభించిపోయాయి. మరి అలాంటప్పుడు ఈ రిసార్టుల బిల్లులు ఎవరు భరిస్తున్నారో, దానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.