విద్యావంతుడైన అఖిలేష్ మూర్ఖంగా వ్యవహరించాడు : ఉమాభారతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. యూపీలోని బుందేల్ఖండ్లో నెలకొన్ని తాగునీటి కొరతను నివారించేందుకు కేంద్రం రైలు వ్యాగన్ల ద్వారా నీటిని పంపించింది. ఈ రైలును అఖిలేష్ ప్రభుత్వం గురువారం ఝాన్సీలో అడ్డుకుంది.
దీనిపై కేంద్రం జోక్యం చేసుకుందన్న సమాచారంతో అఖిలేశ్ వేగంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని వ్యాఖ్యానించిన అఖిలేశ్... ఇందులో కేంద్రం ప్రమేయం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి ఉమాభారతి కాస్తంత కఠువుగానే స్పందించారు. విద్యావంతుడైన అఖిలేశ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా తాగునీరు, ఆహారం వంటి వాటిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే అఖిలేశ్, ఆ తర్వాత ఉమాభారతి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.