మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (11:26 IST)

క్లైమాక్స్‌కు తమిళనాడు ఆధిపత్య పోరు... చెన్నైకు రానున్న గవర్నర్ విద్యాసాగర్ రావు

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. తమిళనాడులో శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నది ఎందరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం వెంట ఎంతమంది ఉన్నారు?

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. తమిళనాడులో శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నది ఎందరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం వెంట ఎంతమంది ఉన్నారు? సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతున్నట్టు పన్నీర్ మరోసారి సీఎం బాధ్యతలు చేపడతారా? లేక అమ్మ నెచ్చెలిగా ఉన్న శశికళ, రాష్ట్రానికి మూడో మహిళా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహిస్తారా? ఈ ప్రశ్నలకు గురువారం సాయంత్రానికి సమాధానం లభించనుంది. 
 
ముఖ్యంగా శశికళపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన విషయం తెల్సిందే. తనతో బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారని సీఎం ఓపీఎస్ ప్రకటించారు. ఆ తర్వాత శశికళకపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అదేసమయంలో శాసనసభా నేతగా శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్, శశికళల మధ్య పోరు ముమ్మరంగా సాగింది. 
 
ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకు రాకుండా ఢిల్లీ, ముంబైలలో కూర్చొండిపోయారు. దీనిపై విమర్శలు చెలరేగడంతో ఆయన గురువారం మధ్యాహ్నానికి చెన్నైకు చేరుకోనున్నారు. దీంతో గవర్నర్‌ను అటు శశికళ, ఇటు పన్నీర్ సెల్వంలు అపాయింట్మెంట్ కోరారు. వీరిలో ఎవరిని ముందుగా కలుస్తారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. విద్యాసాగర్ చెన్నైకి చేరిన వెంటనే, రాజ్‌భవన్‌కు వెళ్లతారు. అక్కడ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు మరికొందరు ఉన్నతోద్యోగులను పిలిపి తాజా పరిస్థితులను తెలుసుకుంటారు. 
 
ఆపై సీఎం పదవిని కోరుకుంటున్న శశికళ, పన్నీర్‌లను పిలిపించవచ్చని సమాచారం. ఎవరికి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందో తెలుసుకుని, నిబంధనలకు అనుగుణంగా వారికి అవకాశం కల్పించి బల నిరూపణ చేసుకోవాలని కొంత గడువును ఆయన విధిస్తారని న్యాయ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.