భారత్ గౌరవాన్ని అమ్మకానికి పెట్టిన అమెజాన్: ఖబడ్డార్ అన్న సుష్మా
అమెజాన్ అమ్మకాలకే పుట్టిందన్నది జగమెరిగిన సత్యం. దాని కోరలు ప్రపంచమంతా వ్యాపించాయని కూడా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఉత్పత్తుల అమ్మకాలకు అది పేరుమోసిందని కూడా తెలుసు. దేశాల బడ్జెట్లనే మించ
అమెజాన్ అమ్మకాలకే పుట్టిందన్నది జగమెరిగిన సత్యం. దాని కోరలు ప్రపంచమంతా వ్యాపించాయని కూడా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఉత్పత్తుల అమ్మకాలకు అది పేరుమోసిందని కూడా తెలుసు. దేశాల బడ్జెట్లనే మించిపోయిన ఆదాయాలతో ఆన్ లైన్ వాణిజ్యాన్ని శాసిస్తున్న విషయమూ తెలుసు. కాని ఒక దేశ గౌరవాన్ని ఫణంగా పెట్టి ఆన్ లైన్ అంగట్లో అమ్మడానికి బరితెగిస్తే.. కాళ్లు తుడుచుకునే మ్యాట్లపై భారత జాతీయ పతాకాన్ని ముద్రించి అమ్మితే.. సరుకులను అమ్ముకుని బతికే కంపెనీ జాతీయ పతాకాన్ని అవమానిస్తే. 125 కోట్ల భారతీయుల ఆగ్రహావేశాలను ప్రతిబింబిస్తూ భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కబడ్డార్ అంటూ అమెజాన్ను హెచ్చరించారు.
అంతర్జాతీయ ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్ కెనడా విభాగం భారత జాతీయ పతాకాన్ని పోలిన డోర్ మ్యాట్లను ఆన్లైన్లో విక్రయించే సాహసానికి ఒడిగట్టింది. ఎన్ని అవమానాలకు గురైనా భారతీయులు సహించి ఊరుకుంటారులే అన్న ధీమాతో అమెజాన్ తలపెట్టిన దుష్టత్వానికి భారత్ కంపించిపోయింది. భారత జాతీయ పతాకాన్ని అవమానించిన అమెజాన్ ఘాతుక చర్యను ఒక వ్యక్తి ట్విట్టర్ ద్వారా కేంద్ర హోంమంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకురావడంతో అమెజాన్ తీరుపై ఆమె ఆగ్రహం ప్రదర్శించారు.
అమెజాన్ చేసిన పనికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అమెజాన్ కెనడా విభాగం తన వెబ్సైట్లో పెట్టిన డోర్ మ్యాట్ ఉత్పత్తులను వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ సుష్మా ట్వీట్ చేశారు. తక్షణమే దీనిపై స్పందించకుంటే అమెజాన్ అధికారులకు ఇచ్చిన వీసాలు రద్దు చేస్తామని, కొత్త వీసాలను వాటికి మంజూరు చేయమని సుష్మా హెచ్చరించారు. ఈ అంశంపై కెనడాలోని భారత హైకమిషనర్తో సంప్రదించిన సుష్మా అమెజాన్ కెనడా విభాగంపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
భారతీయులను ఆగ్రహంలో ముంచెత్తిన ఈ ఘటనపై అమెజాన్ ఇండియా లేదా అమెజాన్ కెనడా విభాగం నుంచి అదికారికంగా ఎలాంటి వివరణ రానప్పటికీ, డోర్ మ్యాట్ల బేస్ డిజైన్పై భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన ఆ ఉత్పత్తులను తన వెబ్సైట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.