శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (09:44 IST)

విధి వైచిత్రి అంటే ఇదేనేమో : గల్లంతైన విమానం పైలట్‌గా భర్త.. ఏటీసీ విధుల్లో భార్య...

ఇటీవల భారత వైమానికి దళానికి చెందిన ఏన్ 32 రకం విమానం ఒకటి గల్లంతు అయింది. ఇందులో 12 మంది ప్రయాణిస్తున్నారు. ఈ విమానాన్ని ఆశిష్ తన్వర్ (29) అనే పైలట్ నడిపారు. ఆ విమానంతో సంబంధాలు కలిగివుండే ఏటీసీ విధుల్లో ఆయన భార్య నిమగ్నమైంది. ఈ విమానం అదృశ్యమైందన్న విషయం తొలుత తెలిసింది కూడా ఆమెకు మాత్రమే. వివాహమైన యేడాదికే భర్త అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం, అందుకు భార్య ప్రత్యక్ష సాక్షి కావడాన్ని అనేక మంది మంది విధి ఆడిన వింత నాటకంగా భావిస్తున్నారు. 
 
ఇటీవల భారత్ - చైనా సరిహద్దుల్లో ఏఎన్ 32 రకం యుద్ధ విమానం ఆచూకీ తెలియకుండా పోయిన విషయం తెల్సిందే. ఈ విమానం గత సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి ఏఎన్‌–32 రకం విమానం 12 మందితో బయలుదేరింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కంట్రోల్‌ రూంతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. భర్త నడుపుతున్న విమానం కంట్రోల్‌ రూంతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని అందరికంటే ముందుగా జోర్హాట్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) అధికారిగా ఉన్న సంధ్య గ్రహించారు. మిగతా వారిని అప్రమత్తం చేశారు.
 
ఆశిష్‌ తన్వర్, సంధ్య వివాహం 2018లో కాగా, ఇద్దరూ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హోదా అధికారులే. పెళ్లయిన ఏడాదికే ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని సంధ్యా కలలోనైనా ఊహించి ఉండకపోవచ్చు. విమానంతోపాటు ఆశిష్, తదితరుల జాడ తెలియక పోవడంతో వారి కుటుంబసభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది.