గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (18:48 IST)

మహాభారతం: ''లక్క గృహం'' నుంచి పాండవులు తప్పించుకున్న సొరంగం బయటపడింది..? (వీడియో)

మహాభారతంలో దుర్యోధనుడు పాండవులను అంతం చేసేందుకు లక్క గృహాన్ని నిర్మిస్తాడు. ఆ లక్క గృహంలో పాండవులు వసింపజేస్తాడు. కానీ ఆ గృహం నిప్పుకు ఆహుతి అవుతుందని పసిగట్టిన విదురుడు పాండవులను అప్రమత్తం చేస్తాడు.

మహాభారతంలో దుర్యోధనుడు పాండవులను అంతం చేసేందుకు లక్క గృహాన్ని నిర్మిస్తాడు. ఆ లక్క గృహంలో పాండవులు వసింపజేస్తాడు. కానీ ఆ గృహం నిప్పుకు ఆహుతి అవుతుందని పసిగట్టిన విదురుడు పాండవులను అప్రమత్తం చేస్తాడు. లక్క గృహం నుంచి వారిని రక్షించేందుకు ఓ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. పురోచనుడు పాండవుల కోసం నిర్మించిన గృహానికి ప్రవేశించిన వెంటనే ధర్మరాజు, భీముడు ఇంటి గోడల నుంచి లక్క, తైలము, నెయ్యి కలిపిన వాసన రావడం గమనిస్తారు.
 
అప్పుడు విదురుడు విషాగ్నుల నుంచి అప్రమత్తంగా వుండాలని చెప్పి పంపిన మాటలు ధర్మజునికి గుర్తుకు వస్తాయి. విషాగ్నులు అంటే ఇవన్నమాట అనుకున్నాడు. పురోచనునని ఆ ఇంట్లోనే వుంచి దహించి వేద్దామని ఆవేశంతో అన్న భీమునిని శాంతపరిచిన ధర్మరాజు.. ఆ ఇంటనే వుంటాడు.  
 
పురోచనుడు, పాండవులకు సేవ చెయ్యడానికి ఒక బోయ వనితను నియమించాడు. ఆమెకు ఐదుగురు కొడుకులు. అందరూ పాండవులు నివసిస్తున్న గృహంలోనే ఉంటారు. పాండవుల కదలికలు రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి చేరవేస్తున్నారు.
 
హస్తినాపురంలో ఉన్న విదురుడికి ఈ కుతంత్రం తెలిసిపోతుంది. వెంటనే ఒక ఖనకుడిని పాండవుల వద్దకు పంపిస్తాడు. వాడు పాండవుల వద్దకు వచ్చి, ధర్మరాజుతో వచ్చే కృష్ణ చతుర్థశి నాడు పురోచనుడు లక్క గృహాన్ని తగులబెడతాడనే విషయాన్ని చెప్తాడు. అందుకే సొరంగ మార్గాన్ని తవ్వాల్సిందిగా విదురుడు తనను పంపినట్లు ఖననుడు చెప్తాడు. 
 
ధర్మరాజు విదురుని దూర దృష్టికి అచ్చెరువొంది, ఖనకుడికి అనుమతి ఇచ్చాడు. ఖనకుడు పాండవుల ఇంటి నుండి వెలుపలికి ఒక బిల మార్గమును ఏర్పాటు చేశాడు. దానిని భీముడు పరీక్షించి తృప్తి చెందాడు. కృష్ణ చతుర్థశి నాడు కుంతీదేవి వారణావతంలో అందరూ నిద్రిస్తున్న వేళ.. భీముడు ముందుగా పురోచనుడు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తల్లిని, తమ్ములను సొరంగ మార్గమున బయటకు పంపాడు. తరువాత తాము నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. ఆయుధాలకు నిప్పుపెట్టాడు.
 
ఖనకుడికి తాము క్షేమంగా ఉన్నట్టు చెప్పి, సొరంగ మార్గము ద్వారా భీముడు తల్లిని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజును, అర్జునుడిని చెరి ఒక భుజం మీద కూర్చొపెట్టుకుంటాడు. నకుల సహదేవులను చెరి ఒక చేత్తో ఎత్తుకుని లక్క గృహం నుంచి తప్పించుకుంటారు. 
 
మరుసటి రోజు లక్క ఇల్లు తగలబడటం వారణావత ప్రజలు చూస్తారు. అందరూ వచ్చి ఆ బూడిద కుప్పలను తొలగించారు. అందులో బోయవనిత, ఆమె ఐదుగురు కొడుకుల శవాలు కనిపించాయి. ఆ ఆరుగురు, కుంతీదేవి, పంచ పాండవులు అనుకుని బోరున విలపించారు. ధృతరాష్ట్రుని కుయుక్తిని తిట్టిపోసారు.
 
ఖనకుడు కూడా జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ, ఆ బూడిదను తాను తవ్విన సొరంగంలో పోసి అది కనపడకుండా చేసాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్లి విదురుడికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని తెలిపాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఎంతో దుఃఖించారు. వారితోపాటు విదురుడు కూడా దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు పాండవుల మరణానికి ఎంతో సంతోషించాడు. అయితే లక్క గృహం నుంచి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. లక్క గృహం నుంచి తప్పించుకునేందుకు ఖననుడు తవ్విన సొరంగ మార్గం ప్రస్తుతం బయటపడింది. 
 
ఈ సొరంగం తవ్వకానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఐఎస్) అధికారులు కూడా అనుమతినిచ్చారు. డిసెంబర్ తొలివారం నుంచి మూడు నెలల పాటు ఈ సొరంగ మార్గంలో తవ్వకాలు ప్రారంభం అవుతాయని ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ సొరంగ మార్గం బాగ్పట్‌ జిల్లాలోని బర్నావాలో వుంది. ఈ తవ్వకాల్లో ఆర్కియాలజీ విద్యార్థులు కూడా పాల్గొంటారని ఏఎస్ఐ అధికారి కేకే శర్మ తెలిపారు. 
 
ప్రస్తుతానికి ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా గుర్తించలేమని తవ్వకాలు పూర్తయ్యాక.. కచ్చితమైన నిర్ధారణకు వస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని పాండవులు ఉపయోగించివుంటారని. 2014లో చందయాన్ గ్రామంలో రాగి కిరీటం లభించిందని.. మరిన్ని ఆధారాల కోసం తవ్వకాలను ఆరంభించాల్సి వుందని కేకే శర్మ చెప్పుకొచ్చారు.