గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (09:10 IST)

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : త్రిపురలో బీజేపీ - సీపీఎం హోరాహోరీ

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ఉదయం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా త్రిపురలో బీజేపీ - అధికార సీపీఎం మధ్య హోరాహోరీగా సాగుతోంది. నాగాలాండ్‌ల

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం ఉదయం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో భాగంగా త్రిపురలో బీజేపీ - అధికార సీపీఎం మధ్య హోరాహోరీగా సాగుతోంది. నాగాలాండ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతోంది. అలాగే మేఘాలయలో ఎన్.పి.పి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
ఉదయం 9 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు... త్రిపుర (60)లో బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 2, సీపీఎం 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే, నాగాలాండ్‌(60)లో బీజేపీ 12, కాంగ్రెస్ 1, ఎన్.పి.ఎఫ్ 3 చోట్ల, మేఘాలయ(60) రాష్ట్రంలో బీజేపీ 4, కాంగ్రెస్ 9, ఎన్.పి.పి. 11, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. కాగా, త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగగా, మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్‌ జరిగింది.
 
త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్‌డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది.