బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (04:34 IST)

పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి.. డిఎంకె నిరసన దీక్ష.. రాష్ట్రపతికి ఫిర్యాదు

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సభా నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్‌లను రంగంలోకి దించి, పథకం ప్రకారం ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌పై దాడి చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు దొరికినట్టు సమాచారం. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సభా నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్‌లను రంగంలోకి దించి, పథకం ప్రకారం ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌పై దాడి చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు దొరికినట్టు సమాచారం. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందా ఈ ప్రశ్నకు డీఎంకే నాయకులు అవుననే అంటున్నారు. మార్షల్స్‌ ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఇందుకు బలమైన రుజువని చెబుతున్నారు. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో ఆ తొమ్మిది మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయమై స్టాలిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌ విచారణకు ఆదేశించినట్టు సమాచారం.
 
సభలో స్పీకర్‌ కూడా లేని సమయంలో చొరబడ్డ ఆ అధికారులు బలవంతంగా స్టాలిన్‌ను బయటకు ఎత్తుకెళ్లినట్టు ఆధారాలు బయట పడ్డాయి.  శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్‌ కుమార్, ఆర్‌ సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌ అనే ఐపీఎస్‌లు సభలోకి వచ్చినట్టు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమంలో సాగిన అల్లర్ల వ్యవహారంలో వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. 
 
సభలో సాగుతున్న గందరగోళం మేరకు ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే, హఠాత్తుగా ఐపీఎస్‌లకు మార్షల్స్‌ యూనిఫారాలు ఎక్కడి నుంచి వచ్చాయని, సభలో స్పీకర్‌ లేని సమయంలో ఎలా మార్షల్స్‌ ముసుగులో ఆ అధికారులు ప్రవేశించారని డీఎంకే ప్రశ్నించింది. దీంతో ఈ తొమ్మిది మంది మెడకు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
స్టాలిన్‌కు జరిగిన అవమానంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తనను బలవంతంగా ఎత్తుకు వచ్చి, దాడి చేశారని స్టాలిన్‌ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై పోరాటానికి డీఎంకే శ్రేణులు సిద్ధమయ్యాయి. దూకుడు ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్టాలిన్‌ నిర్ణయించారు. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ సమావేశం అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరిపారు. 
 
దాడికి నిరసనగా ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్‌ నేతృత్వం వహించనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు కూడా అనుమతి కోరనున్నామని స్టాలిన్‌ తెలిపారు. దీక్షకు డీఎంకే సిద్ధం అవుతోంటే, మెరీనా తీరంలో నిషేదాజ్ఞల్ని ఉల్లంఘించి ఆందోళన నిర్వహించారని పేర్కొంటూ, స్టాలిన్, ఇద్దరు ఎంపీలు, 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు.