గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (09:46 IST)

'పీడన మీట' నొక్కడం మరిచిన 'జెట్' సిబ్బంది.. హత్యాయత్న కేసు

తాజాగా, ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్‌లోని గాలి ఒత్తిడి(ప్రెజర్)ని కంట్రోల్ చేసే పీడన మీట (బ్లీడ్ స్విచ్)ను నొక్కడం సిబ్బంది మరిచిపోయారు. దీంతో, విమానంలో ప్రాణవాయువు త

తాజాగా, ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్‌లోని గాలి ఒత్తిడి(ప్రెజర్)ని కంట్రోల్ చేసే పీడన మీట (బ్లీడ్ స్విచ్)ను నొక్కడం సిబ్బంది మరిచిపోయారు. దీంతో, విమానంలో ప్రాణవాయువు తగ్గిపోయి పీడన సమస్య ఏర్పడింది. ఈ కారణంగా ప్రయాణికులు శ్వాసపీల్చడం కష్టంగా మారింది. అలాగే, విమానంలో పీడనం తగ్గడం వల్ల ప్రయాణికుల చెవులు ముక్కుల్లో నుంచి రక్తస్రావమైంది. దీంతో వెంటనే తిరిగి ముంబైలోనే విమానాన్ని కిందికి దించి... ప్రయాణికులందర్నీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు.
 
దీనిపై పౌరవిమానయాన శాఖ సీరియస్ అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు, కాక్‌పిట్‌ సిబ్బందిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. సంస్థకు చెందిన ముంబై - జైపూర్‌ విమానం (9డబ్ల్యూ0697)లో కాక్‌పిట్‌ బృందం తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి, ప్రయాణికులను చంపటానికి ప్రయత్నించారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గురువారం జెట్‌కు చెందిన బోయింగ్‌ విమానంలో పీడన సమస్య ఏర్పడింది. పలువురు ప్రయాణికులకు ముక్కు, చెవుల నుంచి రక్తం వచ్చిన విషయం తెలిసిందే. 
 
విమానంలో పైలట్ల క్యాబిన్‌లో బ్లీడ్ స్విచ్ ఉంటుంది. అంటే విమానం గాల్లో ఎగురుతున్నపుడు క్యాబిన్‌లో పీడనం నిర్వహించేందుకు వీలుగా బ్లీడ్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్‌ను విమానం బయలుదేరే సమయానికి ముందుగానే ఆన్ చేయాలి. అలా చేయకుండే విమానంలో ప్రాణవాయువు తగ్గిపోవడం వల్ల ప్రయాణికులు శ్వాసపీల్చడం కష్టంగా మారుతుంది. విమానంలో పీడనం తగ్గడం వల్ల ప్రయాణికుల చెవులు ముక్కుల్లో నుంచి రక్తస్రావం జరుగుతుంది. 
 
అసలు ఈ పీడన మీట (బ్లీడ్ స్విచ్) నొక్కడం వల్ల జరిగే ఉపయోగమేంటంటే... క్యాబిన్‌లో పీడనం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా గాలిని (దీనినే బ్లీడ్‌ ఎయిర్‌ అంటారు) పంప్‌ చేస్తారు. విమానం ప్రయాణిస్తున్నప్పుడే... బయట ఉన్న అతిశీతల గాలిని టర్బైన్‌ ఇంజన్లు లోపలికి లాక్కుంటాయి. 
 
ఆ గాలిని 200 డిగ్రీల దాకా వేడి చేస్తాయి. తర్వాత ఒక పద్ధతి ప్రకారం గాలిని క్యాబిన్‌లోకి పంప్‌ చేస్తారు. ఇదంతా జరగాలంటే విమానం బయలుదేరే ముందే సిబ్బంది 'బ్లీడ్‌ స్విచ్' ఆన్‌ చేయాలి. జెట్‌ ఎయిర్‌‌వేస్‌ సిబ్బంది అదే మరిచిపోయారు. ఫలితంగా ముంబై - జైపూర్‌ల మధ్య నడిచే జెట్ ‌ఎయిర్‌వేస్‌లో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.