గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (18:08 IST)

రూ.లక్ష చెల్లిస్తే.. స్వర్గలోక టిక్కెట్ ఇస్తా : బాబా రాంపాల్ నయా మోసం!

రూ.లక్ష చెల్లిస్తే స్వర్గలోకానికి వెళ్లే టిక్కెట్‌ను ఇస్తానంటూ వివాదాస్పద బాబా రాంపాల్ తన వద్దకు వచ్చే అమాయక భక్తులను మోసం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రాంపాల్ బాబా అరెస్టు తర్వాత ఆయన అక్రమాలు, లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ మాయా ప్రచారంలో పడి రూ. లక్ష సమర్పించుకున్న భక్తులు చాలా మందే ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం దాకా తమ కస్టడీలో ఉన్న బాబా రాంపాల్, తన నయా దందాను స్వయంగా వెల్లడించారని హిసార్ ఎస్పీ సత్యేంద్ర కుమార్ గుప్తా చెప్పారు. తన దందాను నిర్విఘ్నంగా సాగించేందుకు రాంపాల్ చిట్ ఫండ్ స్కీముల తరహాలో ఓ భారీ పథకాన్ని పకడ్బందీగా నడిపారని గుప్తా తెలిపారు. 
 
చిట్ ఫండ్ కంపెనీలు తమ ఏజెంట్లకు కనీసం కమీషనైనా ఇస్తాయేమో కాని, రాంపాల్ మాత్రం తన పథకాన్ని ప్రచారం చేసిన ఏజెంట్లకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. తన భక్తులుగా మారే వారు ఒక్కొక్కరు ముగ్గురు వ్యక్తులను కానీ, ఓ కుటుంబాన్ని కానీ తన వద్దకు తీసుకురావాలని ఆయన టార్గెట్లు నిర్దేశించే వారట. ప్రస్తుతం రాంపాల్ బాబా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న విషయం తెల్సిందే.