శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2014 (12:22 IST)

బెంగుళూరులో ఐఎస్ఐఎస్ రిక్రూటర్ : బ్రిటన్‌ టీవీ ‘చానెల్‌ 4 న్యూస్‌’ కథనం!

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)కు కర్ణాటక రాజధాని బెంగళూరులో రిక్రూటర్‌ ఉన్నాడంటూ బ్రిటన్‌ టెలివిజన్‌ సంస్థ ‘చానెల్‌ 4 న్యూస్‌’ గురువారం ప్రసారం చేసిన కథనం దేశంలో సంచలనం రేపుతోంది. బెంగళూరు కేంద్రంగా ‘మెహిదీ మెహబూబ్‌ బిశ్వాస్‌’ అనే మారు పేరుతో ట్విట్టర్‌లో "@ShamiWitness' పేరిట ఖాతా ద్వారా ఆ వ్యక్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చానెల్‌ 4 పేర్కొంది. 
 
ఈ జిహాదీ ‘ఐటీ నగరం’లోగల ఓ పెద్ద భారత సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్లు ఆ టీవీ కథనం వెల్లడించింది. ఈ సమాచారంతో ఉలిక్కిపడిన బెంగళూరు పోలీసులు నగరాన్ని జల్లెపడుతున్నారు. ట్విట్టర్‌ ఖాతా వెనుకనున్న వ్యక్తి బెంగళూరు ఐటీ సిటీలోనివాడు కాకపోవచ్చునని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. 
 
అయితే, ప్రస్తుతం మూతపడిన సదరు ఖాతా ఐఎస్‌ ప్రచార యుద్ధంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. కాగా, పాకిస్థాన్‌ పోలీసులు తొలిసారిగా అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ భారత విభాగం ‘అల్‌‌ఖైదా ఇండియా (ఏక్యూఐ) సభ్యులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు అగ్రశ్రేణి కమాండర్‌ కూడా ఉండటం గమనార్హం.