గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (14:28 IST)

ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్న రాహుల్- హాట్ అండ్ కోల్డ్ అటాక్

తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తన ప్రసంగంతో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆపై లోక్‌సభలో నాటకీయ పరిణామం చోటుచేసుకు

తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తన ప్రసంగంతో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆపై లోక్‌సభలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. తనపై ప్రధానికి కోపం, ద్వేషం వుందని.. వాటిని తొలగిస్తానంటూ ప్రసంగం ముగించే ముందు నరేంద్ర మోదీ వద్దకెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ చర్యతో ప్రధాని మోదీ అవాక్కయ్యారు. ఈ పరిణామంతో సభ్యులంతా షాక్ తిన్నారు. 
 
అంతకుముందు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అగస్టా స్కామ్‌పై మండిపడ్డారు. నిజాలను విని భయపడకండి, పది, పదిహేను మంది వ్యాపారవేత్తల కోసం బ్యాంకుల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు మాఫీ చేయించారని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, మద్దతు ధర పెంచి యూపీ, పంజాబ్, హర్యానాలకు కేంద్రం కేవలం రూ.10 వేల కోట్ల సాయం చేసిందని, దేశంలో మహిళలకు రక్షణ లేదని భారతదేశం గురించి తొలిసారి ప్రపంచం అనుకుంటోందని అన్నారు. 
 
దేశ వ్యాప్తంగా సామూహిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నామని, ప్రపంచం ముందు చులకనవుతున్నామని రాహుల్ ఎత్తిచూపారు. ఇలాంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎన్నడూ లేదని, దేశ ప్రజలు రక్షణ కోల్పోతున్నా ప్రధాని మోదీ భరోసా ఇవ్వలేరా? ఇన్ని జరుగుతున్నా ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా బయటకు రాదని మండిపడ్డారు.
 
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విరుచుకుపడటంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో, గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో, పది నిమిషాల పాటు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
 
పదినిమిషాల అనంతరం సభను ప్రారంభించిన స్పీకర్ మాట్లాడుతూ, ఈ చర్చ సావధానంగా, సమన్వయంతో జరగాలని, పరస్పర ఆరోపణలతో ప్రయోజనం ఉండదని సభ్యులకు సూచించారు. ఇలాగే కొనసాగితే సభ నిర్వహణ కష్టమవుతుందని, రక్షణ మంత్రిపై నేరుగా ఆరోపణలు చేశారని, వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని స్పీకర్ అన్నారు.