శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:10 IST)

భయపెట్టే గదులు.. కంపుకొట్టే మరుగుదొడ్లు.. ఇదే పరప్పణ అగ్రహార జైలు

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలుపై అన్ని పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. దీనికి కారణం.. అక్రమాస్తుల కేసులో జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలుపై అన్ని పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. దీనికి కారణం.. అక్రమాస్తుల కేసులో జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. ఆమె వెంట మరో ముద్దాయి ఇళవరసి, జయ దత్తపుత్రుడు సుధాకరన్‌లు కూడా ఉన్నారు. దీంతో ఈ జైలు చరిత్ర ఇపుడు మరోమారు తెరపైకి వచ్చింది.  
 
ఈ జైలు సుమారు 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద జైళ్లలో ఒకటి. 2014లో జయలలితతో పాటు ఇదే జైలుకు వచ్చిన శశికళ, అప్పట్లో ప్రత్యేక హోదాను జైల్లో అనుభవించారు. ప్రైవేటు గది, ఫ్యాన్, 24 గంటలూ నీరు వచ్చే టాయిలెట్ తదితర సౌకర్యాలు పొందారు. 
 
ఇప్పుడలా కాదు. మిగతా ఖైదీలతో సమానంగా ఆమె కూడా ఉండాలి. బ్యారక్‌లోని టాయిలెట్లో రోజుకు గంట పాటు మాత్రమే నీరు వస్తుంది. తెల్లవారుజామున టాయిలెట్ అలవాటు లేకుంటే, ఆపై వాటిని వాడటం అంత సులువు కాదు. రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. 
 
ఇక ఈ జైలుకు గత మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. పెద్ద పెద్ద గోడలున్న ఓ మురికివాడలా జైలు లోపలి పరిస్థితులు ఉంటాయని, తొలిసారి దీన్ని చూస్తే, భయపడాల్సిందేనని ఇక్కడికి వెళ్లి వచ్చిన వారు చెబుతారు. అలాగే, ఉదయం లేచిన తర్వాత మిగతావారితో సమానంగా రోజంతా తనకు అప్పగించిన పనిని ఆమె చేయాల్సి వుంటుంది. 
 
జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు చక్కబెట్టాలన్న ఆమె వ్యూహానికి ఈ నిబంధన అడ్డంకిగా నిలవవచ్చని తెలుస్తోంది. శశి ప్రత్యేక ఖైదీ కాదు కాబట్టి, ఆమెను స్పెషల్‌గా చూస్తే, ఆ వార్త వెంటనే బయటకు పొక్కిపోతుంది. ములాఖత్‌లు కూడా ఎక్కువగా ఉండవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలు ఎవరు వచ్చినా పరిమితంగానే రావాల్సివుంటుంది.