శీలం ధర రూ.41 వేలు : బీహార్ రాష్ట్రంలో.. పంచాయతీ పెద్దల తీర్పు!
మహిళ శీలానికి ఖరీదు కట్టే షరాబులు ఈమధ్య బాగా పెరిగిపోయారు. ఆటవిక రాజ్యం నడిచే బీహార్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. బీహార్లోని కటిహర్ జిల్లా కోదా గ్రామంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఈ మహిళ చేసిన తప్పేమిటంటే.. పని కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన ఈమెపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆ గ్రామ పెద్దలు విచారించి.. ఆమె శీలానికి రూ.41 వేల వెల కట్టారు.
తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... బీహార్ రాష్ట్రం కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదా గ్రామంలో పని కోసం ఓ దళిత మహిళ పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది. దీంతో ప్రకాశ్, నరేష్ రవిదాస్ అనే వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో పంచాయతీ పెద్దలు ఆమె శీలానికి 41 వేల రూపాయల ఖరీదు కట్టారు.
ఈ డబ్బులు తీసుకుని అత్యాచార ఘటనను మరచిపోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని పంచాయతీ పెద్దలు బాధితురాలిని ఆదేశించారు. దీంతో బాధితురాలు నిరసన వ్యక్తం చేయడంతో, నిందితుడు ఆమె భర్తకు నిప్పంటించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నరేష్ రవిదాస్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నాడు.