తండ్రి వెల్డింగ్ పని చేసినా.. ఐఐటీలో సీటు, మైక్రోసాఫ్ట్లో రూ.కోటి ఆఫర్!
తండ్రి వెల్డింగ్ పని చేస్తున్నప్పటికీ.. అతనికి చదువుల పట్ల ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. ఐఐటీలో సీటు సాధించడమే కాకుండా చదువు పూర్తి కాకుండానే ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో ‘కోటి’ వేతనంతో కొలువు కూడా కొట్టేశాడు. ప్రస్తుతం విద్యాభ్యాసంలో చివరి దశలో ఉన్న అతడు, ఈ ఏడాది అక్టోబర్లో నేరుగా మైక్రోసాఫ్ట్ కేంపస్లో సగర్వంగా అడుగెట్టనున్నాడు.
వివరాల్లోకి వెళితే.. గుండారాజ్ రాజ్యమేలుతున్న బీహార్లోని ఖగారియాలో వెల్డర్ వృత్తితో కుటుంబాన్ని నెట్టుకూంటూ వస్తున్న చంద్రకాంత్ సింగ్ చౌహాన్ తన కుమారుడు వత్సలిసా సింగ్ చౌహాన్ను బాగా చదివించాలనుకున్నాడు. వత్సలిసాకు కూడా చదువు బాగానే అబ్బింది. తన గురువు చెప్పిన మేరకు ఇంజినీరింగ్ అంటే మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు ఖరగ్ పూర్ ఐఐటీలో సీటే లక్ష్యంగా పట్టు వదలని విక్రమార్కుడే అయ్యాడు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 382వ ర్యాంకు సాధించాడు. నేరుగా ఖరగ్ పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో సీటు సాధించి, ఇంజినీరింగ్లోనూ సత్తా చాటాడు. గత డిసెంబర్లో జరిగిన కేంపస్ ఇంటర్వ్యూల్లో అతడి ప్రతిభకు మైక్రోసాఫ్ట్ ఫిదా అయిపోయింది. ఏడాదికి రూ.1.02 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. ప్రపంచ సాప్ట్ వేర్ దిగ్గజం చేసిన బంపరాఫర్కు సరేనన్న వత్సలిసా, తన చదువు పూర్తి కాగానే ఈ అక్టోబర్లో ఉద్యోగంలో చేరునున్నాడు.