బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:33 IST)

బలవంతపు మతమార్పిడులకు బీజేపీ వ్యతిరేకం : అమిత్ షా!

దేశంలో బలవంతపు మతమార్పిడులకు తాము, తమ పార్టీ వ్యతిరేకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పుకొచ్చారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తూ తమ ప్రభుత్వం రూపొందించనున్న బిల్లుకు ఇతర రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. లౌకిక పార్టీలుగా ప్రచారం చేసుకుంటున్న పార్టీలు ఈ విషయంలో ముందుకురావాలని ఆయన కోరారు. 
 
మత మార్పిడుల బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తామని ఆయన శనివారం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ‘ఘర్ వాపసీ’ పేరిట హిందూ అనుకూల వర్గాలు చేపట్టనున్న మత మార్పిడుల అంశం కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల ఈ అంశంపై తాను స్పందించబోనని చెప్పారు. 
 
ఇకపోతే.. తమిళులకు స్వభాషాభిమానం ఎక్కువన్న విషయాన్ని పసిగట్టిన అమిత్ షా, దానినే ఆయుధంగా తీసుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు చెన్నైవాసులకు క్షమాపణలు చెప్పిన అమిత్ షా, ‘‘తమిళం నేర్చుకోవడం ప్రారంభించాను. త్వరలో తమిళంలోనే మాట్లాడతా’’నంటూ ఆయన వ్యాఖ్యానించారు.