శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2015 (06:50 IST)

దక్షిణాదిపై దృష్టి... మూడురోజులు మోడీ మకాం

భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశ రాష్ట్రాలు లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వేళ్ళూనుకపోవడంతో తమ పార్టీ విస్తరణ అంత సులువు కావడం లేదు. కర్ణాటక మినహా మరెక్కడా అంత పెద్ద పట్టూ లేదు. దీంతో పార్టీని పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యంగా కార్యవర్గ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. మోడీ ఇక్కడే మకాం వేసి అన్ని నడపనున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి బెంగుళూరు వేదికగా మారింది. ఇక్కడ అన్ని అంశాలపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడే మూడు రోజులు మకాం వేయడం అనేది సాధాసీదా విషయం కాదు. 
 
ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు రానున్నారు. ఆయన మూడు రోజులు  బెంగళూరులోనే ఉంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. గురువారం ఇటీవల పునర్వ్యవస్థీకరించిన నూతన జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశం జరుగుతుంది. మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు ఈ సమావేశంలో పాల్గొంటారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు ఈ సమావేశాల్లో  కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ నేత మురళీధర్ రావు తెలిపారు. కార్యవర్గ సమావేశాల్లో సభ్యులతో పాటు జేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శాసనసభా పక్ష నేతలతో కలిపి మొత్తం 330 మంది పాల్గొంటారు.