అరుణ్ జైట్లీకి దమ్ముంటే నల్లధన కుబేరుల లిస్టు బయటపెట్టాలి : దిగ్విజయ్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి దమ్ముంటే కేంద్రం చేతికి వచ్చిన నల్లధన కుబేరుల జాబితాను బహిరంగ పరచాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ను భయపెట్టే మాటలను మాట్లాడొద్దని ఆయన హితవు పలికారు.
ఇదే అంశంపై డిగ్గీరాజా మాట్లాడుతూ నల్లధనం జాబితాలో కాంగ్రెస్ నేతల పేర్లున్నాయంటూ పేర్లను లీక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. దమ్ముంటే జాబితాలోని పేర్లను వెల్లడించాలని అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కాగా, బుధవారం ఆర్థిక మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల పాలవుతుందని... యూపీఏ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి పేరు లిస్టులో ఉందంటూ ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతూ అరుణ్ జైట్లీకి బహిరంగ సవాల్ విసురుతున్నారు.