ఛత్తీస్గఢ్ ఫ్యూజ్ కర్మాగారంలో పేలుడు: ఐదుగురి మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు సమీపంలోని ఛోటి ఉర్లా గ్రామంలో ఉన్న నవభారత్ ఫ్యూజ్ కర్మాగారంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు కార్మికులు మరణించారు. 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.
గాయపడినవారు రాయ్పూర్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్మాగారంలో డిటోనేటింగ్ ఫ్యూజ్ తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కుప్పకూలిపోయింది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెపుతున్నారు.