మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (13:27 IST)

బీహార్ కోర్టులో పేలింది మానవ బాంబేనా : కేంద్రం ఆరా

బీహార్ కోర్టులో శుక్రవారం పేలింది మానవ బాంబేనా అనే అంశంపై కేంద్ర హోంశాఖతో పాటు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బీహార్‌లోని ఆరా సివిల్ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటిక ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక మహిళతో పాటు, కానిస్టేబుల్, మరో పౌరుడు ఉన్నట్టు సమాచారం. బాంబు పేలుడు ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. 
 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం తెల్లవారుజామన న్యూఢిల్లీ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుడు సంభవించడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. భారత్‌లోకి నాలుగు గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ప్రవేశించారని ఐబీ హెచ్చరించిన మరుసటి రోజే బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
 
మరోవైపు.. ఈ ఇది మానవ బాంబేనా అనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ పేలుడులో ఒక మహిళ మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ మహిళ తనను తాను పేల్చేసుకుందని ప్రత్యక్ష సాక్షులను ఊటంకిస్తూ పోలీసులు చెబుతున్నారు. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.