బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (12:17 IST)

మోడీకి అడ్డుకట్ట వేసేందుకు లెఫ్ట్‌తో పొత్తుకు మమత సై : సీపీఎం నిరాకరణ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు వెస్ట్ బెంగాల్‌‍లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, వామపక్ష పార్టీల నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు.
 
బీజేపీకి, మోడీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే బీహార్‌లో కాంగ్రెస్, జెడీయు, ఆర్జేడీ చేతులు కలిపాయి. యూపీలో బీఎస్పీతో చేతులు కలిపేందుకు ఎస్పీ మొగ్గు చూపినా మాయావతి నో చెప్పారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ముప్పయ్యేళ్లుగా కమ్యూనిస్టుల పైన పోరాడిన మమతా బెనర్జీ కూడా వారితో పొత్తు కోసం సిద్ధమంటున్నారు. ఇదంతా మోడీ మాయేనని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
రాజకీయాల్లోనూ.. ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ అంటరానివారు కాదనీ, సీపీఎంతో పొత్తుకు తాము కూడా వ్యతిరేకం కాదని అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము అన్ని తలుపులు తెరిచి ఉంచుకుంటామని, అవకాశం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పొత్తుకు సంబంధించి సీపీఎం నుంచి ప్రతిపాదన వస్తే దానిని పార్టీలో చర్చిస్తామని, తమ పార్టీలో వివిధ స్థాయులు ఉన్నాయని, వాటిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదనలను లెఫ్ట్ నేతలు తిరస్కరించారు.