శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (12:04 IST)

కేంద్ర మంత్రా.. అయితే మాకేంటి.. పాత నోట్లు మేం తీసుకోం : సదానందకు ఆస్పత్రి షాక్

పెద్ద నోట్ల రద్దు కష్టాలు కేవలం సామాన్య ప్రజలకే కాదు.. కేంద్ర మంత్రులకు సైతం తాకుతోంది. ఈ మంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలను పోషిస్తున్నారు. ఆయన పేరు సదానంద గౌడ. గతంలో

పెద్ద నోట్ల రద్దు కష్టాలు కేవలం సామాన్య ప్రజలకే కాదు.. కేంద్ర మంత్రులకు సైతం తాకుతోంది. ఈ మంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలను పోషిస్తున్నారు. ఆయన పేరు సదానంద గౌడ. గతంలో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. 
 
ఈయన సోదరుడు భాస్కర్ గౌడ కొద్దిరోజులుగా కామెర్లతో బాధపడుతున్నారు. మంగళూరులోని కస్తూర్బా మణిపాల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. పదిరోజులుగా చికిత్స పొందుతున్న భాస్కర్ గౌడ మంగళవారం మృతి చెందారు. ఆయనను పరామర్శించడానికి కేంద్ర మంత్రి సదానంద గౌడ వెళ్లిన సమయంలోనే సోదరుడు కన్నుమూశాడు. 
 
ఆసుపత్రికి చెల్లించాల్సిన రూ.60 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో సదరు మంత్రి రూ.60 వేలు చెల్లించారు. అయితే, ఆసుపత్రి ఆ డబ్బు తీసుకునేందుకు అంగీకరించలేదు. కారణం అవన్నీ పాత 5వందలు, వెయ్యి నోట్లు కావడమే.
 
నవంబర్ 8 నుంచి పాత నోట్లు రద్దు చేసినందు వల్ల, వాటిని తీసుకోవడం లేదని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే డాక్టర్లు చెప్పిన సమాధానంతో కేంద్ర మంత్రికి ఒళ్లు మండింది. పాత నోట్లను డిసెంబర్ 31వరకూ మార్చుకోవచ్చని చెప్పినా ఇలా వ్యవహరించడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఆసుపత్రి తనకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
 
దీంతో ఆసుపత్రి యాజమాన్యం దిగొచ్చింది. చెక్కు తీసుకోవడానికి అంగీకరించింది. ఈ విషయం మంత్రిని తీవ్రంగా కలచివేసింది. ఆసుపత్రులు ఇంత దారుణంగా ప్రవర్తించడం సమంజసం కాదని ఆయన చెప్పారు. విషయంపై ప్రధానికి లేఖ రాస్తానని సదానంద గౌడ తెలిపారు.