శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:01 IST)

అక్కడ దినకరన్ అరెస్టు... ఇక్కడ విలీనం ఖాయమా? క్లైమాక్స్‌కు అన్నాడీఎంకే పాలిటిక్స్

అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల చిహ్నం రెండాకుల గుర్తును తిరిగి స్వాధీనం చేసుకునే వ్యవహారంలో ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత, శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ను ఢిల్

అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల చిహ్నం రెండాకుల గుర్తును తిరిగి స్వాధీనం చేసుకునే వ్యవహారంలో ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత, శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అర్థరాత్రి ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ అరెస్టులో అన్నాడీఎంకేలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రెండుగా వేరుపడిన అన్నాడీఎంకే వైరివర్గాలు ఇకపై చేతులు కలిపే అవకాశం ఉంది. 
 
కాగా, ఈసీకి లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో నాలుగు రోజులుగా ఢిల్లీ పోలీసులు దినకరన్ వద్ద విచారిస్తూ వచ్చారు. తొలిరోజు 7 గంటలు, రెండో రోజు 10 గంటలు, మూడోరోజు 9 గంటలు, నాలుగో రోజు 10 గంటలపాటు దినకరన్‌ను పోలీసులు ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి చాణక్యపురిలోని క్రైమ్‌ బ్రాంచ్‌ అంతర్రాష్ట్ర కార్యాలయంలో ఆయన్ను ప్రశ్నించిన పోలీసులు అర్థరాత్రి సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 
 
దినకరన్‌ను అరెస్ట్‌ చేసినట్టు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌) ప్రవీర్‌ రంజన్‌ రాత్రి 11.52 గంటల సమయంలో ప్రకటించారు. కాగా.. బ్రోకర్‌ సుఖేశ్‌ చంద్రశేఖర్‌ను తాను కలిసిన మాట నిజమేగానీ.. అతడికి ఎలాంటి డబ్బూ ఇవ్వలేదని విచారణలో దినకరన్‌ తెలిపినట్టు పోలీసు వర్గాలు వివరించాయి. దినకరన్‌తోపాటు ఆయన స్నేహితుడు మల్లికార్జున్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 
 
తమిళనాట ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాల విలీన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దినకరన్‌ అరెస్ట్‌ కీలక ఘట్టమని.. అక్కడ పరిణామాలు శరవేగంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆశపడిన జయలలిత స్నేహితురాలు శశికళ అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 
 
అలాగే, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరిన దినకరన్‌ కూడా ఇపుడు జైలు ఊచలు లెక్కించే పరిస్థితి వచ్చింది. దీంతో శశికళ కుటుంబానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తున్న మాజీ సీఎం పన్నీర్ సెల్వం తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరే అవకాశం ఉంది.