మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (08:15 IST)

ఆ రక్షణ వస్తువుల దిగుమతులపై కేంద్రం నిషేధం

సాయుధ దళాలకు సంబంధించిన 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇది రక్షణ రంగంలో కీలకమైన అడుగు అని తెలిపారు. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులు దేశీయంగానే తయారీ చేస్తామన్నారు. 2020-2024 మధ్య రక్షణ వస్తువులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. 

సాయుధ దళాల అవసరాలను గుర్తించి రక్షణ పరిశ్రమకు తెలియజేస్తామన్నారు. సాయుధ దళాల అవసరాలను దేశీయంగా తీర్చటానికి వీలు ఉందని పేర్కొన్నారు. డీఎంఏ ద్వారా మరిన్ని రక్షణ పరికరాలను గుర్తించి నిషేధం విధిస్తామన్నారు.

రక్షణ బడ్జెట్‌ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దుగా విభజించామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. నిషేధం విధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గడువు విధిస్తామని చెప్పారు. నిషేధ ఉత్పత్తుల్లో ఫిరంగి తుపాకులు, రైఫిళ్లు, రవాణా విమానాలు ఉన్నాయి. 

ఈ నిర్ణయం భారత రక్షణ పరిశ్రమకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. కొత్త ఉత్పత్తుల్లో సొంత డిజైన్‌తో పాటు అభివృద్ధి సామర్థ్యాలను ఉపయోగించొచ్చు. లేదా సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు డీఆర్‌డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవచ్చు అని రాజ్‌నాథ్‌ అన్నారు.