శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (13:06 IST)

చార్ ధామ్ యాత్ర ప్రారంభం..! తెరచుకున్న యమునోత్రి, గంగోత్రి గేట్లు..!

హిమాలయ పర్వాత శ్రేణుల్లో కొలువున్న మహాశివుని దర్శించుకునేందుకు భక్త జనం కదిలింది. హిందువులు పరమ పవిత్ర యాత్రగా భావించే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఉదయం 11:30 గంటల సమయంలో యమునోత్రి గేట్లను అధికారులు తెరువగా, మధ్యాహ్నం 12.30 గంటలకు గంగోత్రి ఆలయ తెలుపులు తెరిచి తొలి బ్యాచ్ భక్తులకు అనుమతి ఇచ్చారు. 
 
ఇదేవిధంగా యాత్రలో అతి ముఖ్యమైన కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 24వ తేదిన ఉదయం 8.30 గంటలకు, బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 26వ తేది ఉదయం 5.15 గంటలకు తెరుస్తారని అధికారులు వెల్లడించారు. 
 
కాగా ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, సీనియర్ అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలు చార్ ధామ్ ప్రాంతాలను సర్వనాశనం చేయగా, 7 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అటువంటి విపత్తులు ఏర్పడినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు రావత్ తెలిపారు. 
 
సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తుకు పైగా ఉన్న ఈ క్షేత్రాలను విపరీతమైన మంచు కారణంగా అక్టోబర్-నవంబర్ సీజన్లో మూసివేసి మార్చి-ఏ్రపిల్ లో వచ్చే అక్షయ తృతీయ నాడు తిరిగి తెరిచే సంప్రదాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.