శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (11:02 IST)

బాబా రాంపాల్ ఆశ్రమంలో బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు.. ఆయుధాలు..

హర్యానా రాష్ట్రం, హిస్సార్‌లోని వివాదాస్పద బాబా రాందేవ్‌కు చెందిన సత్‌‌లోక్ ఆశ్రమంలో సోదాలు జరుపుతున్న పోలీసులకు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కమాండో దుస్తులు లభ్యమయ్యాయి. ఆశ్రమంలోని లాకర్లను తెరిచి చూడగా, నాలుగు పాయింట్ 315 బోర్ రైఫిళ్లు, అయిదు పాయింట్ 12 బోర్ తుపాకులు, కొన్ని కాట్రిడ్జ్ లు దొరికాయని, మూడు బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కొన్ని కమాండో డ్రెస్‌‌లు ఉన్నాయని హర్యానా రాష్ట్ర డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ చెప్పారు. 
 
కాగా, ఆశ్రమంలో దొరికిన ఆయుధాల గురించి ప్రశ్నించేందుకు, మూసివున్న లాకర్లను తెరిపించేందుకు బాబా రాంపాల్‌ను పోలీసులు ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆశ్రమ ఆవరణలోని లాకర్లు, అల్మరాల గురించి రాంపాల్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. మేజిస్ట్రేట్ సమక్షంలో లాకర్లను తెరిచినట్లు వారు తెలిపారు. దాదాపు గంటసేపు ఆశ్రమంలో ఉండిన రాంపాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించిందని వశిష్ట్ తెలిపారు.
 
రాంపాల్ అనుచరులు పోలీసులతో ముఖాముఖి తలపడడానికి సిద్ధపడ్డారని భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఏకే రావు తెలిపారు. ఆశ్రమంలో కొంత నగదు దొరికిందని, సోదాలు పూర్తయిన తర్వాతే ఎంత దొరికిందో లెక్క వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా, 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆశ్రంలో అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్టు పోలీసులు గుర్తించిన విషయం తెల్సిందే.