పార్టీ బలోపేతానికి కృషి చేస్తా... సీతారాం ఏచూరి హామీ..!
దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తానని సీపీఎం తాజా ప్రధాన కార్యదర్శి, తెలుగు నేత సీతారాం ఏచూరి హామీ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చోటుచేసుకున్న సమస్యలను తీర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
తనపై ఉంచి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అలాగే మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థవంతంగా ఎత్తిచూపుతామని సీతారాం ఏచూరి తెలిపారు.
కాగా విశాఖపట్నం వేదికగా సీపీఎం 21వ మహాసభలు ఏప్రిల్ 14న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ సభలు ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీకి నూతన అధ్యక్షుడిగా పార్టీ నేతలంతా కలిసి సీతారాం ఏచూరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 16 మంది సీపీఎం పోలిట్ బ్యూరోను ఎంపిక చేశారు.