శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (09:47 IST)

అజ్ఞాతవాసం వీడి ఢిల్లీకి రానున్న రాహుల్ గాంధీ!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా అజ్ఞాతవాసం గడుపుతున్నారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారనే అంశం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై నిఘా వర్గాలు సైతం ఆరా తీసినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చే వారం ఢిల్లీ రానున్నట్టు తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. 
 
వాస్తవానికి పార్టీలోని అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీనికి పార్టీ అధిష్టానం ససేమిరా అనడంతోనే సెలవుపై వెళ్లి ఎంతకీ తిరిగిరావట్లేదట. అత్యంత కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు కూడా. ఈ సెలవు గడవు ముగిసినా ఆయన జాడ లేదు. ఢిల్లీకి వచ్చాక మాట్లాడుకుందామంటూ అధిష్టానం చేసిన ఆపర్‌ను సైతం ఆయన తిరస్కరించారు. 
 
సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తే కాని తిరిగివచ్చేది లేదని రాహుల్ తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో అధిష్టానం దిగొచ్చింది. మే 15 నుంచి సెప్టెంబర్ 30లోగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో శాంతించిన రాహుల్ గాంధీ అజ్ఞాతాన్ని వీడేందుకు సమ్మతించారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీలో వాలిపోతారట. వచ్చీరాగానే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన ఉవ్వళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.