గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఆర్మీ చీఫ్‌గా బిపిన్ రావత్.. మండిపడిన కాంగ్రెస్ : 10 జన్‌పథ్ పర్మిషన్ కావాలా... బీజేపీ ప్రశ్న

భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇపుడు నియామకం చుట్టూ రాజకీయ వివాదం కమ్ముకుంటోంది. ఆయన కంటే ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ వారిని పక్కనపె

భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇపుడు నియామకం చుట్టూ రాజకీయ వివాదం కమ్ముకుంటోంది. ఆయన కంటే ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ వారిని పక్కనపెట్టి బిపిన్ రావత్‌ను నియమించడాన్ని కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. 
 
ప్రతి సంస్థకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయని, సీనియారిటీని గౌరవించాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. రావత్ సామర్థ్యాని తాము ప్రశ్నించడం లేదని, సీనియర్లను పక్కనపెట్టి లైనులో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తిని కొత్త ఆర్మీ చీఫ్‌‌గా తీసుకోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. 
 
లెఫ్ట్ నేతలు మాట్లాడుతూ... ఆర్మీలో నియామకం, సీవీసీ, ఇతర ఉన్నత స్థాయి నియామకాలన్నీ వివాదాస్పదంగా మారుతుండటం దురదృష్టకరమన్నారు. సైన్యం అంటే దేశానికంతటికీ చెందినదని, అలాంటప్పుడు ఆయా నియామకాలు ఎలా జరిపిందీ దేశానికి చెప్పాల్సిన అవసరం, నియామకంపై ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, విపక్ష నేతల విమర్శలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కొత్త సైన్యాధ్యక్షుడి నియామకాన్ని ప్రశ్నించడమంటే ఆయా రాజకీయ పార్టీల్లో దేశభక్తి లేపించడమేనని అభివర్ణించింది. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ నియామకానికి 10, జన్‌పథ్ (సోనియాగాంధీ అధికార నివాసం) పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలను సమయం వచ్చినప్పుడల్లా ప్రశ్నించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, తాము అధికారాన్ని కోల్పోయామన్న విషయాన్ని ఇప్పటికీ శతాధిక వత్సరాల పార్టీ జీర్ణించుకోలేకపోతోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదివారం అన్నారు. 
 
ఇదిలావుండగా, భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ల కొత్త చీఫ్‌ల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘రా’కు అనిల్ దస్మానాను, ‘ఐబీ’కు రాజీవ్ జైన్‌ను కొత్త చీఫ్‌లుగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘రా’ చీఫ్‌గా రాజేంద్ర ఖన్నా, ‘ఐబీ’ చీఫ్‌గా దినేశ్వర్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఆయా చీఫ్‌లుగా దస్మానా, జైన్‌లు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.