శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (13:15 IST)

మరో వివాదంలో స్వామి నిత్యానంద.. ఆ ఇద్దరు యువతుల సంగతేంటి?

స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడు. అతని ఆశ్రమంలో ఇద్దరు కుమార్తెలను బంధించారని వారి తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరుతూ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

స్వామి నిత్యానందకు చెందిన బెంగళూరులోని ఓ విద్యా సంస్థలో తమ నలుగురు కుమార్తెలను చేర్పించామని ఏడు నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్నప్పుడు తమ కుమార్తెలను అక్కడ చేర్పించామని జనార్దనశర్మ, అతని భార్య కోర్టుకు తెలిపారు.
 
అయితే నిత్యానంద ధ్యానపీఠానికి సంబంధించిన అహ్మదాబాద్‌లోని యోగిని సర్వజ్ఞ పీఠానికి తమ కుమార్తెలను ఈ ఏడాది తరలించారని, వారిని కలిసేందుకు తాము యత్నించామని చెప్పారు.

అయితే ఆ పీఠానికి సంబంధించిన అధికారులు తమను అనుమతించలేదన్నారు. ఆ తర్వాత పోలీసుల సహకారంతో తాము పీఠానికి వెళ్లామని, ఆ సందర్భంగా మైనర్లయిన ఇద్దరు కుమార్తెలను తాము వెనక్కి తీసుకొచ్చామని వెల్లడించారు. 
 
కానీ, తమ ఇద్దరు పెద్ద కుమార్తెలు లోపముద్ర (21), నందిత (18) మాత్రం తమతో రాలేదని చెప్పారు. వారిద్దరినీ పీఠానికి చెందిన అధికారులు కిడ్నాప్ చేశారని, చట్ట విరుద్ధంగా బంధించారని ఆరోపించారు. తమ కూతుళ్లను సురక్షితంగా తమకు అప్పగించేలా పోలీసులను, పీఠానికి చెందిన అధికారులను ఆదేశించాలని కోరారు.
 
అంతకుముందు బిడాడిలోని గురుకుల్ ఆశ్రమంలో వారంతా ఉన్నారు. కానీ, అక్కడి నుంచి వారిని తనకు ఎలాంటి సమాచారం లేకుండా అహ్మదాబాద్‌కు తరలించినట్టు ఆ కుమార్తెల తండ్రి జనార్థన్ ఆరోపిస్తున్నాడు.

తమ పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులను గురుకుల్ సిబ్బంది అనుమతించడం లేదని విమర్శించాడు. నాలుగు నెలల నుంచి పిల్లల ఆచూకీ కోసం నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నామని.. అయినా తన పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నాడు.
 
ఇదిలా ఉండగా, 19ఏళ్ల బాలిక, ఆమె సోదరి ఎక్కడ ఉన్నారో తెలియదు. గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫేస్ బుక్ లో వీడియో లీక్ అయింది. ఆశ్రమం నుంచి తమను తల్లిదండ్రులు తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వీడియోలో చిన్నారులు ఆరోపించారు.

కాగా, అత్యాచారం కేసులో స్వామి నిత్యానందకు 2018 సెప్టెంబర్ నెలలో జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2019 జనవరిలో హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. ప్రస్తుతం నిత్యానంద అజ్ఞాతంలోకి ఉన్నట్టు సమాచారం. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.