భారత్లో మతకలహాల కోసం దావూద్ ఇబ్రహీం కుట్ర : ఎన్.ఐ.ఏ
భారత్లో మతకలహాల కోసం దావూద్ ఇబ్రహీం కుట్ర పన్నుతున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) వెల్లడించింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆర్ఎస్ఎస్ నేతలు, మత పెద్దలతో పాటు, చర్చ్లపై దాడులు చేయాలని దావూద్ కుతంత్రం చేశారని ఎన్ఐఏ వెల్లడించింది.
దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా ఈ దాడులు చేసేందుకు దావూద్ కంపెనీ (డీ-కంపెనీ) నియమించిన 10 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. వీరివద్ద జరిపిన విచారణలో ఈ విషయం బహిర్గతమైంది. 2014లో బీజేపీ నేతృత్వంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే, దావూద్ ఈ కుట్ర చేశారని ఎన్ఐఏ తెలియజేసింది.
డీ-కంపెనీ సభ్యులలో పాకిస్థాన్కు చెందిన జావేద్ చిక్నా, దక్షిణాఫ్రికాకు చెందిన జాహిద్ మియాన్ అలియాస్ జావో ఇద్దరూ.. హిందూ నేతలను హతమార్చడంతో పాటు, ఇతర మత పెద్దలు, చర్చ్లపై దాడులకు వ్యూహరచన చేశారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల జాబితా కూడా వారు సిద్ధం చేశారని అధికారులు చెప్పారు.