గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (12:53 IST)

ఉద్రిక్తంగా ఛలో ఢిల్లీ : టియర్ గ్యాస్ ప్రయోగం :: 2 నెలలకు సరిపడ ఆహారంతో రైతులు

కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రైతులు ర్యాలీగా ఢిల్లీ సరిహద్దుకు చేరుకోగానే ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, రైతులు ఏమాత్రం లెక్కచేయక ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. సరిహద్దుల్లో భారీగా చేరుకున్న రైతులు, బలగాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ సందర్భంగా పోలీస్‌ అధికారి మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌‌ను ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదని, వచ్చేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సరిహద్దు వద్ద భద్రతను బలోపేతం చేశామని, ఇసుకతో నింపిన ట్రక్కులు, వాటర్‌ కెనాన్‌లను అందుబాటులో ఉంచారు.
 
ఇకపోతే, తమ ఛలో ఢిల్లీ కార్యక్రమంపై రైతులు స్పందిస్తూ, తనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునేంత వరకూ తాము కదలబోమని తేల్చి చెప్పారు. ఢిల్లీకి వెళ్లేందుకు తమకు ఎంత సమయం పట్టినా వేచి చూస్తామని, రహదారులను వీడి స్వస్థలాలకు మాత్రం వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద రెండు నెలల కాలానికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయని రైతులు మీడియాకు వెల్లడించారు.
 
ఇక ఈ నిరసనల్లో పాల్గొనాలని వచ్చిన ప్రతి రైతు, తన వంతు ఆహార పదార్ధాలను తీసుకుని వచ్చారు. "నా వద్ద రెండున్నర నెలలకు సరిపడా ఆహారం ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ వండుకుని తినడమే" అని తన ట్రాక్టర్‌కు మార్పులు చేసుకుని దానిలోనే ఆహార ధాన్యాలను తీసుకుని వచ్చిన తార్పీత్ ఉప్పాల్ అనే రైతు వెల్లడించారు. 
 
తార్పీత్ ట్రాక్టర్‌లో 5 వేల లీటర్ల వాటర్ ట్యాంక్, గ్యాస్ స్టవ్, ఇన్వర్టర్, చాపలు, దుప్పట్లు, కూరగాయలు, గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. తనతో వచ్చిన రైతుల్లో ఎవరికీ తిరిగి ఇంటికి వెళ్లాలన్న ఆలోచన లేదని ఆయన అనడం గమనార్హం.