బంగళాల కేటాయింపు అంశానికి రాజకీయం.. అంబికా సోని, సెల్జాలకు ఫైన్!
తమకు కేటాయించిన బంగళాల అంశాన్ని రాజకీయం చేసినందుకు కేంద్ర మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ మహిళానేతలను ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టి.. రూ.25 వేల చొప్పున అపరాధం విధించింది. అంతేకాకుండా, డైరక్టరేట్ ఆఫ్ ఎస్టేట్ అధికారులు కేటాయించిన బంగళాలకు తక్షణం మారాలని ఆదేశించింది.
ఈ ఇద్దరు మహిళా నేతలు గత యూపీఏ పాలనలో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఆ సమయంలో వీరికి న్యూఢిల్లీలోని 22 అక్బర్ రోడ్డు బంగళాలో అంబికా సోని, 7 మోతీలాల్ నెహ్రూ మార్గ్లో సెల్జా నివసిస్తున్నారు. అధికారం పోయిన తర్వాత కూడా వీరు అదే బంగళాల్లో నివశిస్తున్నారు. ఇవన్నీ టైప్ 8 రకం బంగళాలు. పదవిపోయిన తర్వాత వీరికి టైప్ 7 బంగళాలను కేటాయించారు. వీరి అర్హతకు తగినట్టుగా బంగళాలను కేటాయించారు.
కానీ, అర్హత లేకున్నా పెద్ద పెద్ద బంగళాల్లో కొనసాగడమేకాకుండా గడువులోగా ఖాళీ చేయాలన్నందుకు, ఈ అంశాన్ని రాజకీయం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రులిద్దరికీ టైప్- 8 బంగళాల్లో నివసించే అర్హత లేదని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వీరికి టైప్ 8 బంగళాల్లో నివశించే అర్హత లేకపోయినప్పటికీ.. ఈ అంశాన్ని రాజకీయం చేసినందుకు వారిద్దరికీ రూ.25 వేల చొప్పున న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.ఎండ్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.