అధికారమిస్తే ఢిల్లీ వాసిగా హస్తినకు రుణపడివుంటా : కిరణ్ బేడీ
తనకు ఢిల్లీ ప్రజలు అధికారమిస్తే ఢిల్లీ వాసిగా ఢిల్లీ ప్రజలకు రుణపడివుంటానని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ప్రకటించారు. వచ్చే నెల 10వ తేదీన జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ బేడీ ఢిల్లీలోని కృష్ణా నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆమె ఢిల్లీ నగర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీకి శక్తిమంతమైన పరిపాలన అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తన 40 ఏళ్ల అనుభవాన్ని అంకితం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.
'నా నలభై యేళ్ల కార్యనిర్వహణ, ప్రజా సేవ అనుభవంతో ముఖ్యమంత్రిగా ఢిల్లీకి సేవ చేస్తాను. ఢిల్లీకి బలమైన ప్రభుత్వం అవసరం. ఓ దీర్ఘకాల ఢిల్లీ నివాసిగా నగరానికి మనం రుణపడి ఉన్నామని గట్టిగా నమ్ముతున్నా. తప్పకుండా సమర్థమంతమైన, మంచి ప్రభుత్వాన్ని మా జట్టు (బీజేపీ) ఇవ్వగలదు' అని బేడీ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె 70 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.