బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (18:04 IST)

నిర్భయ దోషి వ్యాఖ్యలు నీచమైనవి.. ఐరాస ఆగ్రహం..!

దేశాన్నే కుదిపేసిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. భారత ప్రభుత్వం నిషేధ ఆజ్ఞలను సైతం ఉల్లంఘించి బీబీసీ నిర్భయ కేసులో దోషి ఇంట్వ్యూను ప్రసారం చేసింది. ఈనేపథ్యంలో నిర్భయ కేసులో దోషి ముఖేశ్ సింగ్ వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. 
 
దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖేశ్ సింగ్ మాటలు అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయని అన్నారు. మనుషులు మాట్లాడలేనంత నీచంగా అతను వ్యాఖ్యానించినట్టు ఆయన పేర్కొన్నారు. మహిళలపై అతని ఆలోచనలు అత్యంత అసహ్యకరంగా ఉండడం గర్హనీయం అన్నారు. 
 
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోవడంలో పురుషులు తగు పాత్ర పోషించాలన్నారు. అయితే నిర్భయ ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత ప్రభుత్వం నిషేధించడంపై స్పందించడానికి నిరాకరించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన బీబీసీ ఆమె తల్లిదండ్రులు, డిఫెన్స్ లాయర్లు, పోలీసులు, వైద్యులను సంప్రదించి ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. 
 
అందులో రేపిస్టు ముఖేశ్ సింగ్, అతని డిఫెన్స్ న్యాయవాదుల వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.