బాయ్ఫ్రెండ్ ఘాతుకం.. ఢిల్లీ విద్యార్థినిని ఇంట్లోనే కడతేర్చిన వైనం...
ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. గత కొన్ని రోజులుగా మిస్టరీగా మారిన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. బాయ్ఫ్రెండే ఈ విద్యార్థినిని హతమార్చాడు. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు సమ్మతించక పోవడంతో ప్రియురాలి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఢిల్లీ యూనివర్సిటికి చెందిన ఆర్జూ సింగ్ అనే విద్యార్థిని మూడో సంవత్సరం చదువుతూ వచ్చింది. ఈమెకు నవీన్ కుమార్ అనే యువకుడు ప్రేమించాడు. గత కొంతకాలంగా సాగుతూ వచ్చిన ఈ ప్రేమ వ్యవహారం హద్దులు దాటింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. తీరా తన తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో ఆమెనే కడతేర్చాడు.
మోడల్ టౌన్లోని నవీన్ కుమార్ ఇంట్లోనే ఆర్జూ శవమై తేలింది. కూతురు ఆచూకి కోసం వెతుకుతూ శనివారం నవీన్ ఇంట్లో సోదా చేసిన ఆమె తల్లిదండ్రులు వెంటిలేషన్ షాఫ్ట్లో (గాలి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులైన్) ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. నవీన్ ఇంటిపై పోలీసులు దాడి చేసి పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆర్జూ శవాన్ని కనుగొన్నారని ఆమె సోదరి తెలిపారు.
తాము అక్కడికి వెళ్లినప్పుడు ఆర్జూ మృతదేహం చేతులు వెనక్కి కట్టేసినస్థితిలో ఉబ్బిపోయి ఉందని, తాము కనీసం గుర్తించలేకపోయామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న అర్జూను హత్యచేసిన నవీన్.. రెండు రోజుల తర్వాత మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. కాగా ఆర్జూ, నవీన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. ఇందుకు నవీన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఆమె సోదరి తెలిపారు. నవీన్ను అరెస్టు చేసిన పోలీసులు ఆర్జూ దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.