శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (08:31 IST)

కప్పల జంటకు విడాకులు

సాధారణంగా వర్షాలు కురవడం కోసం పల్లెటూళ్లలో కప్పలకు పెళ్లి చేసే వారు.. అదే విపరీతంగా వర్షాలు కురుస్తే..? వరదలు వస్తే ఏమి చేయాలి? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మాత్రం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వెళ్లాల్సిందే.

గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భోపాల్ లో కూడా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయింది. అయితే అంతకంటే ముందు వర్షాలు పడటం లేదన్న కారణంతో భోపాల్‌ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు.

ఆ తరువాత వాతావరణం అనుకూలించడంతో విపరీతంగా వర్షాలు కురిశాయి. దాంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో వానలు ఆగాలని ఒక విచిత్ర ప్రయత్నం చేశారు. వానలు పడటం కోసం ఏ కప్పలకైతే పెళ్లి చేశారో.. అదే కప్పల జంటకు విడాకులు ఇప్పించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. మంగళవారం ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ఈ విడాకుల ప్రక్రియను పలువురు పెద్దల సమక్షంలో నిర్వహించారు. భోపాల్ పట్టణం ఇంద్రపురి ప్రాంతానికి చెందిన శివ్‌ సేవా శక్తి మండల్‌ సభ్యులు పెళ్లి చేసిన కప్పలను విడాకుల పేరుతో విడదీశారు.