బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:30 IST)

త్వరలోనే తమిళనాడులో డీఎంకే పాలన.. సీఎంగా స్టాలిన్ : డీఎంకే ఎమ్మెల్యే

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం మరోమారు త్యాగయ్యగా మారిపోయి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ముఖ్యమం

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం మరోమారు త్యాగయ్యగా మారిపోయి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ నేడోరేపో బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
అయితే, డీఎంకేకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే జె.అన్బళగన్ మాత్రం మరోలా చెపుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కొద్ది రోజులలోనే డీఎంకే అధికారంలోకి రానున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకేస్టాలిన్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తారనని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎంపిక కావటంపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. 
 
మాజీ ముఖ్యమంత్రి జయలలిత శశికళను తన సన్నిహితురాలిగానే మసలుకునేలా చేశారే తప్ప కనీసం పార్టీలో చిన్న పదవిని కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. జయలలిత మృతి తర్వాత పార్టీని, పాలనను తన చెప్పుచేతల్లో తెప్పించుకోవాలనుకున్న ఆకాంక్షను ఎట్టకేలకు శశికళ నెరవేర్చుకున్నారని అన్బళగన్ తన ట్విట్టర్‌ సందేశంలో విమర్శించారు. జయలలిత అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరపాలని కేంద్రంపై తమ పార్టీ ఒత్తిడి తెస్తుందన్నారు.